కష్టాల్లో షుగర్ ఫ్యాక్టరీలు
ఏలూరు ముచ్చట్లు:
చెరకు రైతులను ఆదుకోవాల్సిన చక్కెర కర్మాగారాల పరిస్థితి దయనీయంగా ఉండడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా సక్రమంగా లేకపోవడం వంటి కారణాలు ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. మూడొంతులకుపైగా చక్కెర కర్మాగారాలు రాష్ట్రంలో మూతబడి ఉండడంతో రైతులు కూడా చెరకు సాగువైపు పెద్దగా దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో ప్రైవేటు, సహకార రంగాల్లో మొత్తం 29 కర్మాగారాలు ఉండగా, ఇందులో కేవలం ఐదు మాత్రమే మనుగడలో ఉండడం గమనార్హం.గతంలో చెరకుపైనే ఎక్కువగా ఆధారపడే స్థాయిలో రైతులు ఉండేవారు. ఐదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో చెరకు సాగు బాగానే ఉండేది. అప్పట్లో 18 కర్మాగారాలు పనిచేయడంతో చక్కెర ఉత్పత్తి కూడా మెరుగ్గానే ఉండేది. 82 వేల హెక్టార్లలో చెరకు ఉత్పత్తి కూడా జరిగేది. 2017-18 సీజన్లో ఏకంగా 48 లక్షల మెట్రిక్ టన్నుల వరకు క్రషింగ్ జరిగింది. ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు తారుమారయ్యాయి. కేవలం ఐదు కర్మాగారాలే పనిచేస్తుండడంతో చాలామంది రైతులు చెరకు సాగు మానేసి, ఇతర పంటలవైపు వెళ్లిపోతున్నారు. అందుకే గతేడాది 22.85 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరనే క్రషింగ్ చేయగలిగారు. అందులో నాలుగు ప్రైవేటు రంగానికి చెందిన కర్మాగారాలే క్రషింగ్ చేశాయి.
చోడవరం, తాండవ, ఏటికొప్పాక కర్మాగారాలకు రూ.26 కోట్లకుపైగా బకాయిలు ఉండిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 2021 సీజన్ వరకు చెల్లింపులు జరిగినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ గతేడాదికి ఇంకా చెల్లింపులు జరగలేదు. దీంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది. కర్మాగారాల పరిస్థితి బాగోలేకపోవడంతో పనిచేయని వాటిల్లో ఆరు కర్మాగారాల్లో విఆర్ఎస్ అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిఫార్సులు చేసింది. ఇవన్నీ సహకార రంగంలో ఉన్నవే కావడం విశేషం. దీనిపై గతంలోనే ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం అనేక దఫాలు భేటీలు నిర్వహించి, చివరకు విఆర్ఎస్ సిఫార్సుల నిర్ణయం తీసుకుంది. చిత్తూరు, వెరకటేశ్వర, కడప, కోవూరు, జంపని, అనకాపల్లి సహకార కర్మాగారాల్లో పనిచేస్తున్న వారికి విఆర్ఎస్ అమలు చేయడం వల్ల రూ.108 కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఈ చెల్లింపులపై ఉత్తర్వులు వచ్చినప్పటికీ బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉండడంతో ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబరులోనే ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఇంకా నిధులు మాత్రం విడుదల కాకపోవడం గమనార్హం.

Tags; Sugar factories in trouble
