సూర్యప్రభ వాహనసేవలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శనివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాల్లో 408 మంది కళాకారులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.మహారాష్ట్ర ముంబైకి చెందిన డాక్టర్ అనురాధ బృందం లవని అనే జానపద కళారూపాన్ని, సేలంకు చెందిన కలైవాణి బృందం కొట్టారవాయ్ అనే జానపద కళారూపాన్ని ప్రదర్శించి కనువిందు చేశారు. బెంగళూరుకు చెందిన ఇందూ బృందం శ్రీ కృష్ణావతార వైభవ లీలా విశేషాలను నృత్య రూపంలో ప్రదర్శించి భక్తులను తన్మయులను చేశారు.తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు, తిరుపతికి చెందిన సుకన్య బృందం సూర్యప్రభ వాహన నృత్యంతో అలరించారు. బెంగళూరుకు చెందిన శివాణి బృందం కంసాలి నృత్యం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శోభాకుమారి బుట్ట నృత్యంతో పరవసింప చేశారు. అనంతపురంకు చెందిన నాగ వర్షిణి బృందం శ్రీనివాస సంకీర్తనా నృత్య రూపకాన్ని నయనానందకరంగా ప్రదర్శించి కనువిందు చేశారు. భీమవరం కు చెందిన కేశవ కుమార్, తిరుమలకు చెందిన ఉద్యోగుల బృందం కోలాటం ప్రదర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వాసు బృందం ముని కన్యల నృత్యం, కడపకు చెందిన కూచిపూడి నృత్యంతో కనువిందు చేశారు.

Tags: Suryaprabha Vahanaseva’s impressive cultural programs
