Natyam ad

శ్రీవారి ఆలయాలతో తమిళనాడు సుసంపన్నం

చెన్నై, మధురై, ఊలందూరు పేట, పాండిచ్చేరిలో నూతన ఆలయాలు
అక్టోబరులో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం
తిరుమలలో త్వరలో శ్రీవారి సర్వదర్శనం
– టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి వెల్లడి
 
తిరుపతి ముచ్చట్లు:
 
శ్రీవారి ఆలయాల నిర్మాణంతో తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలతో సుసంపన్నం కానున్నాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రం, శ్రీవారి ఆలయానికి నూతనంగా స్థానిక సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారి చేత ఆదివారం ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ చెన్నై ఈసిఆర్ లో తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు స్థలాల్లో ఈ ఏడాది ఆఖరులోగా ఒక దాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మధురైలో సిద్ధంగా ఉన్న రెండు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుందని తెలిపారు. ఊలందూరు పేటలో ఆలయ నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనట్టు వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. చెన్నై టీ నగర్ లో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన శ్రీవారి ఆలయాన్ని మరింత విస్తరించి భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జమ్ములో 66 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలియజేశారు. చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్లో కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యంలో నాలుగు ప్రాంతాల్లో విశ్రాంతి గదులు నిర్మించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఊత్తుకోట, సితమంజేరిలో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారిని సర్వదర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
 
 
పేదలకు అందుబాటులో కళ్యాణమండపం :  ఎజె.శేఖర్
చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ ఎజె.శేఖర్ మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా చెన్నై రాయపేటలోని టిటిడి స్థలంలో కల్యాణమండపాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. చెన్నై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఈ ఏడాది శ్రీవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ ను ఆహ్వానించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఎన్ని ఆలయాలు వచ్చినా భక్తుల మనోభావాలకు అనుగుణంగా చెన్నై టి.నగర్ లోని శ్రీవారి ఆలయాన్ని కొనసాగించి, మరింత విస్తరిస్తామని తెలిపారు.
 
 
సభ్యుల ప్రమాణ స్వీకారం
స్థానిక సలహా మండలి నూతన సభ్యుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారందరూ టిటిడి చైర్మన్  వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా  వేలూరు లక్ష్మణ్ వెంకట సుబ్రమణియన్,  ఎం.ప్రభాకర్ రెడ్డి,  డి.కదిర్ ఆనంద్, సభ్యులుగా  పివిఆర్.కృష్ణారావు,  జిఎ.పృథ్వీ,  విఆర్.వెంకటాచలం,  మోహన్ పద్మనాభరావు, యస్. కార్తికేయన్,  కెఎస్.జయరామన్,  ఇందిరా రాజేంద్రన్,  సన్నారెడ్డి రవీంద్రబాబు,  కృష్ణారెడ్డి, ఎం.అశోక్ కిషన్,  వేమిరెడ్డి సందీప్ రెడ్డి,  మారు శరణ్,  ఎన్.కళ్యాణ్ చక్రవర్తి, పి.ధీరజ్ రెడ్డి,  నరేష్ సుబ్రమణి,  శన్భగమూర్తి,  తాతినేని అజయ్,  పన్నీర్ సెల్వం,  పరశురాం ప్రమాణ స్వీకారం చేశారు.  కె.ఆనంద్ కుమార్ రెడ్డి,  ఎస్ఎస్.సుదంతిరం అనివార్య కారణాల వల్ల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేకపోయారు.

Tags; Tamil Nadu is rich with Srivari temples