అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుమల ఎస్వీ మ్యూజియం
– 7డి టెక్నాలజీ వినియోగం
– మ్యూజియం అధికారి కృష్ణారెడ్డి
తిరుమల ముచ్చట్లు:

తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతోందని మ్యూజియం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ టిసిఎస్ సంస్థ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ రూ.20 కోట్లు కలిపి మొత్తం రూ.145 కోట్ల విరాళంతో నూతన హంగులతో మ్యూజియం రూపుదిద్దుకుంటోందన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని వినియోగించి 3డి, 7 డి హంగులతో టిసిఎస్ 14, మ్యాప్ సిస్టమ్స్ 5 కలిపి మొత్తం 19 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయని, వీటిని బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ వారు అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. మిగతా గ్యాలరీలను టీసీఎస్ సంస్థవారు ఆధునీకరిస్తున్నారని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీ వేంకటేశ్వరుడు, రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్న మయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు ఉన్నాయన్నారు.మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు- వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కౌలువుతీరి భక్తులను అబ్బురపరిచేలా ఉన్నాయని చెప్పారు. రెండవ ఫ్లోర్లో విరాట్ పురుషుడు బ్రహ్మ మహేశ్వరులు, ఋగ్వేదం, యజుర్వేదం గ్యాలరీలు ఉన్నాయన్నారు. మూడో ఫ్లోర్లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉందని, మ్యూజియం పైభాగంలో 17 పెద్ద గోపురాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, పురందరదాస, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వంటి భక్తాగ్రేసరులతోపాటు రామాయణ, మహాభారతం, భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శించినట్టు తెలిపారు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియం అభివృద్ధి పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు.మీడియా సమావేశంలో టీటీడీ పీఆర్వో డా. టి.రవి, ఏపీఆర్వో కుమారి పి.నీలిమ, మ్యూజియం క్యూరేటర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
Tags: Tirumala SV Museum with international standards
