అమ్మవారి పంచమి తీర్థం ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబరు 28వ తేదీన జరుగనున్న పంచమి తీర్థం ఏర్పాట్లను ఆదివారం టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు వేచి ఉండేందుకు తొలిసారి షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వచ్చే మార్గంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద దాదాపు 12 వేలు, జడ్పీ హైస్కూల్లో 7 వేలు, పూడి రోడ్ లో 7 వేలు, తిరుచానూరు రోడ్లలో ఏర్పాటుచేసిన క్యూలైన్లలో 10 వేలు పుష్కరిణిలో 15 వేల మందికి కలిపి దాదాపు 50 వేల మందికి వేచి ఉండే ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తులు వేచి ఉండటానికి ఏర్పాటు చేసిన షెడ్లులో అన్నప్రసాదము, కాఫీ, టీ అందిస్తామన్నారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు, తిరిగి వెళ్లేందుకు గేట్లు, బారీకేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పంచమి తీర్థంకు విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

పద్మపుష్కరిణిలో ఉదయం 11.40 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలన్నారు.అంతకుముందు ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అయ్యప్ప స్వామి గుడి వద్ద, జడ్పీ హైస్కూల్లో, పూడి మార్గంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, క్యూ లైన్లు, బారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు .
ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్ వి బిసిసి ఈవో షణ్ముఖ్ కుమార్ ,.ఇ నాగేశ్వరరావు,ఎస్ ఇ-3 సత్యనారాయణ, విద్యుత్ ఎస్ ఇ వెంకటేశ్వర్లు, ఈఈలు మనోహర్, నరసింహ మూర్తి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:TTD EO inspected the Ammavari Panchami Theertham arrangements
