గరుడ సేవ నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులకు వాహన దర్శన భాగ్యం- టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
– హారతుల స్థానంలో భక్తులకు అనుమతి
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన గరుడసేవ అక్టోబర్ 1న జరగనున్న నేపథ్యంలో వాహన సేవకు విచ్చేసే భక్తులందరికి వాహన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో హారతి పాయింట్లు, గ్యాలరీలను ఈవో, డిఐజి రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామి వారి వాహన సేకు అనుమతిస్తామన్నారు. ఒకరు హారతి ఇచ్చే సమయంలో దాదాపు ఐదు మందికి దర్శనం కల్పించవచ్చని చెప్పారు. కావున ఈ ఏడాది హారతులను రద్దు చేసి సామన్య భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ప్రతి హారతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అదేవిధంగా గ్యాలరీలలో రెండు లక్షల మంది, ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజన మండపం వద్దకు షాపింగ్ కాంప్లెక్స్ నుండి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించవచ్చన్నారు. తద్వారా దాదాపు 2.75 లక్షల నుండి నుండి 3 లక్షల మందికి స్వామి వారి గరుడసేవ దర్శనం చేయించవచ్చని ఆయన వివరించారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా గరుడసేవ దర్శనం కల్పించిన తర్వాతే స్వామివారు వాహన మండపానికి చేరుకుంటారని తెలియజేశారు.టిటిడి బోర్డు నిర్ణయం మేరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వివిధ రకాల ప్రివలైజ్ దర్శనాలు రద్దుచేసి, సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు 55 నుండి 65 వేల మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారని చెప్పారు. గురువారం ఉదయం నుండి క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతున్నదని, భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీలోని అన్ని విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో వివరించారు.జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబిసి షణ్ముఖ కుమార్, సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ – 2 జగదీశ్వర్ రెడ్డి, పోలీస్, టీటీడీ అధికారులు ఉన్నారు.
Tags: Vahana darshan bhagyam for nearly three lakh devotees on Garuda Seva- TTD EO AV Dharmareddy