Natyam ad

అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.         అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు.

 

 

Post Midle

ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు  శ్రీనివాసాచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారాతెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

 

 

 

 

తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి జెఈవో  వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తొలిసారి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని తిరుచానూరులో శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు 550 టికెట్లు మంజూరు చేశామని, మరో వెయ్యికి పైగా టికెట్లను భక్తులు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని వర్చువల్ విధానంలో పాల్గొన్నారని తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావడంవల్ల వరలక్ష్మీ వ్రతం అని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, 25 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఇందులో తమలపాకులు, అపిల్‌, ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్‌ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. హైదరాబాద్ కు చెందిన లారస్ ల్యాబ్ విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 2, పుష్కరిణి వద్ద 1, గంగుండ్ర మండపం వద్ద 1 కలిపి 4 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

 

స్వర్ణరథోత్పవం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.   ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ , జెఈవో  వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈఓ  లోకనాథం, విజివోలు శ్రీ మనోహర్, శ్రీ బాలిరెడ్డి, ఏఈఓ  ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు  బాబుస్వామి, సూపరింటెండెంట్లు  శేషగిరి,  శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్  దామోదరం ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: Varalakshmi vratam according to science in Ashtalakshmi mandapam

Post Midle