పల్నాడులో నీటి ఎద్దడి
గుంటూరు ముచ్చట్లు:
ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రాజెక్ట్ లు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. దీంతో సాగు నీటి కష్టాలు రైతులకు ప్రారంభమయ్యాయి. విత్తనం నాటిన దగ్గర నుండే నీటి కష్టాలు మొదలయ్యాయి. అయితే వ్యవసాయం తప్ప మరొకటి చేతగాని అన్నదాతలు అటు వాన దేవుడిపై భారం వేసి పంటలు సాగు చేయడం మొదలె పెట్టారు. అయితే ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వరి సాగు చేయవద్దని ఇప్పటికే ప్రకటించింది. కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించింది. అయితే వరి వేయడం వదులుకున్న రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు. గత రెండేళ్లలో మిర్చి ధరలు బాగుండటంతో రైతులు దిగుబడి తగ్గినా ధర భాగుంటే ఎంతో కొంత మేర ఆదాయం చేతికొస్తుందన్న ఆశతో మిర్చిని వేశారు.గత కొన్ని రోజులుగా పల్నాడు ప్రాంతంలో వాన దేవుడు ముఖం చాటేశాడు. మొక్కలు నాటిన తర్వాత వర్షాలు లేకపోవడం మరొకవైపు సాగర్ కాలువలు రాకపోవడంతో సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. పల్నాడు జిల్లా బెల్లంకొండలో సాంబయ్య అనే రైతు మిర్చి పంటను కాపాడుకునేందకు చేసిన ప్రయత్నం సాగు నీటికి ఎంత కొరత ఏర్పడిందో అర్ధమవుతుంది. సమయానికి బోరు నుండి కూడా నీరు పొలానికి పెట్టలేకపోవడంతో పంట ఎండి పోతుంది. దీంతో ఆ మొక్కలను బ్రతికించుకునేందుకు సాంబయ్య మరొక మహిళ రెండు బిందెలతో నీటిని తీసుకొని ఒక్కో గ్లాసు నీళ్లను ప్రతి మొక్కకు ప్రోస్తున్నారు. ఇది ఒక్క సాంబయ్య పరిస్థితే కాదు రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నా సకాలంలో తమ వంతు రావడం లేదు. దీంతో ముందుగా మొక్కలను కాపాడుకునేందుకు గ్లాసులతో నీటిని పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.ప్రభుత్వం ఆరుతడులకు నీటిని ఇస్తానని చెప్పడంతోనే మిర్చి సాగు చేశామని రైతులు అంటున్నారు. ప్రస్తుతం ఇంకా సాగర్ కాలువల పరిధిలో సాగునీటిని విడుదల చేయడం లేదు. వచ్చే నెలలోనైనా సాగు నీటిని విడుదల చేస్తే అప్పటి వరకూ పంటలను రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని రైతులు అంటున్నారు. రైతులు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలు చూసి స్థానికులు కంటనీరు పెడుతున్నారు.

Tags: Water crisis in Palnadu
