మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం: ఎంపీ వై.ఎస్. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి.
కడప ముచ్చట్లు:
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తెలిపారు.12 న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహం వద్దకు ఆదివారం వచ్చారు.అక్కడ సీబీఐ అధికారులు లేక పోవడంతో భాస్కర్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విచారణ తేదీని మళ్లీ తెలియ జేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు.హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.అవినాష్ రెడ్డితో పాటు మిమ్మల్ని అదుపు లోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియ జేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తాము దేనికైనా సిద్ధమని భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.భాస్కర్ రెడ్డి ని సీబీఐ ఏడాది కిందట వరుసగా రెండు రోజుల పాటు పులివెందుల లో విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి విచారణకు పిలిచింది.మరోవైపు, భాస్కర్ రెడ్డి రాకతో కడప జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Tags; We are ready for anything: MP Y.S. Avinash’s father is Bhaskar Reddy.
