పుంగనూరులో విన్యాసాలతో ….-మృత్యువాత పడుతున్న యువత
-వాహనం ముందుభాగాన్ని పైకిలేపడం
-భయంకర హారన్ల మోత
-బలౌతున్న అమాయక జనం

– తల్లిదండ్రులకు తప్పని శోకం
పుంగనూరు ముచ్చట్లు:
అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల కోరిక మేరకు తల్లిదండ్రులు రేసువాహనాలను కొని ఇవ్వడం….అవాహనాలతో యువకులు విన్యాసాలు చేస్తూ మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో కుమిలిపోతున్నారు. యువకులు రహదారులపై ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండ ద్విచక్రవాహనాల ముందు చక్రాన్ని పైకి లేపి వాహనం నడపడం, సెల్ఫోన్ బ్లూటూత్ పెట్టుకుని వాహనాలను మితిమీరిన వేగంగా నడపడంతో ప్రమాదాలు జరిగి రోడ్డుపై ప్రయాణిస్తున్న అమాయక ప్రజలు కూడ బలౌతున్నారు. వీటిపై పోలీసులు, రవాణాశాఖాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామీణ, పట్టణ రోడ్లు సుందరంగా ఏర్పాటు కావడంతో యువకులు ఆరహదారులపై విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంబిటి రోడ్డు, బైపాస్రోడ్డు, పట్టణంలోని కోర్టు బైపాస్రోడ్డు, కోర్టురోడ్డు, తిరుపతి రోడ్డు ప్రాంతాలలో యువకులు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతూ భయంకరమైన హారన్లతో ప్రజలను హాడలెత్తిస్తున్నారు. అలాగే రోడ్లపై ముందు చక్రాలను పైకెత్తి నడపడంతో ప్రజలు ఏప్రమాదం జరుగుతుందోనని రోడ్డు నుంచి క్రిందికి దిగి వెళ్లిపోతున్నారు.
పుంగనూరులో ప్రమాదాలు..
పట్టణ బైపాస్ రోడ్డులో ఇలాంటి విన్యాసాలు చేసి, ప్రమాదాల భారీన పడుతున్న యువత కాళ్లు , చేతులు విరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల 19న పలమనేరు పట్టణానికి చెందిన ఆదిల్బాషా (19) ద్విచక్రవాహనంలో బైపాస్రోడ్డులో వేగంగా వెళ్తూ అరబిక్ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడు క్రిందపడటంతో మంటలు చెలరేగ ఆయువకుడు అక్కడిక్కడే సజీవదహనమైయ్యాడు. అలాగే చదళ్ల క్రాస్ వద్ద మదనపల్లెకు చెందిన శ్రీనివాసులు అనే యువకుడు విన్యాసాలు చేసి అక్కడిక్కడే పడి మృతి చెందాడు. పట్టణంలోని గోకుల్ సర్కిల్లో మైనర్ యువకుడు వాహనం నడిపి గణేష్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే సుగాలిమిట్ట వద్ద మస్తాన్ అనే యువకుడు, బైపాస్ క్రాస్ వద్ద శ్రీనివాసులు అనే యువకుడు , మిని బైపాస్రోడ్డులో ఫిరోజ్ అనే యువకుడు విన్యాసాలు చేసి తీవ్రగాయాలపాలైయారు. మరి కొన్ని వెలుగులోనికి రాకుండ ఉండిపోతున్నాయి.
వాహనాలు నడుపుతున్న మైనర్లు …
ద్విచక్రవాహనాలను మైనర్లు ఎక్కువుగా మితిమీరిన వేగంతో నడుపుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. యువకులు మైనర్లు కావడం, లైసెన్సులు లేకపోవడం జరుగుతోంది. తల్లిదండ్రులు వాహనాలను తమ పేరున కొనుగోలు చేసి , పిల్లల సరదాలకు ఇవ్వడంతో వారు ప్రమాదాలకు గురై చనిపోవడం, ప్రజలను ఢీకొన డం జరుగుతోంది. దీని కారణంగా ఇరువురు రోడ్డు ప్రమాదాలకు గురై ఆకుటుంబాలు వీధిన పడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు మైనర్లు ప్రమాదం చేశారని తెలిసినా పెద్ద వాహనాలపైనే కేసులు నమోదు చేయడంతో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు.
బెట్టింగ్ల మోజు…..
యువకులు ద్విచక్రవాహనాలను పైకి ఎత్తి లేపి ఎంత దూరం నడుపుతారో చూసి దానిపై బెట్టింగ్లు కట్టడం చేస్తున్నారు. బెట్టింగ్ల మోజులో యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, విన్యాసాలు చేసి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలను హెచ్చరికలుగా చేసుకోవాలని మేదావి వర్గం సూచిస్తోంది.
తల్లిదండ్రులపై కేసులు…
మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు చేస్తే ఇందుకు బాధ్యులుగా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని సీఐ మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. మైనర్లు విన్యాసాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, మఫ్టి పోలీసులను ఏర్పాటు చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షిస్తూ ఉండాలని , రేసు వాహనాలను కొని ఇవ్వరాదని సూచించారు.
– మధుసూధన్రెడ్డి, సీఐ , పుంగనూరు.
Tags: With stunts in Punganur…-dying youth
