ముత్యపుపందిరిపై బకాసుర వధ అలంకారంలో అలమేలుమంగ
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.

మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు.కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు, జెఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, విఎస్వోలు మనోహర్, బాలి రెడ్డి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి , ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.
Tags: Alamelumanga in Bakasura slaying ornamentation on the mother-of-pearl
