భార్య కోసం జడేజా ప్రచారం
గాంధీనగర్ ముచ్చట్లు:
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతలగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లోని జామ్నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేయనున్నారు. అయితే ఆమె ఈ నెల 22న చేసిన ఓ పోస్ట్ కారణంగా వార్తలలో నిలిచారు. కారణం ఏమిటంటే.. భారత జట్టు జెర్సీని ధరించి ఉన్న రవీంద్ర జడేజా ఫొటోను తమ ప్రచారానికి వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే గాయం కారణంగా జడేజా క్రికెట్ ఆడలేనప్పటికీ, తన కుటుంబానికి రాజకీయ సహాయాలు చేస్తూనే ఉన్నాడు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో అతని భార్య రివాబా జడేజా జామ్నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాంతో తన భార్యకు ఓటు వేయాలని ఆ నియోజకవర్గంలోని ప్రజలను జడేజా అభ్యర్థిస్తూ.. దూకుడుగా ప్రచారం చేస్తున్నాడు.ఈ క్రమంలోనే రివాబా తన సోషల్ మీడియా ఖాతాలో.. తన భర్త రవీంద్ర జడేజా భారత జట్టు జెర్సీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇంకా దానికి ‘‘భారతదేశ ఆల్ రౌండర్ క్రికెటర్ జడేజా నిర్వహించే రోడ్షోలో మీరు భాగం కాబోతున్నారు’’ అని కాప్షన్ రాసుకొచ్చారు.
రివాబా చేసిన ఈ ట్వీట్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ విమర్శించారు. చారిత్రాత్మకంగా ప్రజాజీవితంలో ఉన్నవారు కూడా రాజకీయాలకు దూరంగా ఉండగా.. ఇప్పుడు కొందరు బహిరంగంగానే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.‘‘నిన్నటి వరకు క్రీడాకారులకు రాజకీయాలలో ప్రమేయం లేదు. ఇప్పుడు వారంతా రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. ఏ రంగాన్నీ నాశనం చేయకుండా బీజేపీ వదిలిపెట్టలేదు’’. అయితే అంతక ముందే కాంగ్రెస్ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న క్రికెటర్ జడేజా సోదరి నైనబా జడేజా బీజేపీపై విమర్శల దాడి చేశారు. విలేకరుల సమావేశంలో నైనబా మాట్లాడుతూ.. రివాబా తన ప్రచారానికి పిల్లలను ఉపయోగించుకున్నందునే కాంగ్రెస్ ఆమెను విమర్శిస్తోందని చెప్పుకొచ్చారు. ‘‘సానుభూతి పొందేందుకు రివాబా పిల్లలను ఉపయోగించుకుంటున్నారు. ఒకరకంగా పిల్లలను బాలకార్మికులుగా ఆమె వాడుకుంటున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశార’’ని రేనాబా అన్నారు.

Tags: Jadeja campaign for wife
