ముత్యపుపందిరి వాహనసేవలో ఆరు ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఉదయం ముత్యపుపందిరి వాహన సేవలో ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన ఆరు పుస్తకాలను బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీ పోకలకు అశోక్ కుమార్, జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. అనంతరం రచయితలను వారు శాలువతో సన్మానించి శ్రీవారి ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా.విభీషణ శర్మ, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థచార్యులు ఉపసంపాదకులు డాక్టర్ నరసింహాచార్య పాల్గొన్నారు.’ఆనంద సంహిత’ ‘ఆహ్నికామృతం’అనే గ్రంథాలను డాక్టర్. వేదాంతం విష్ణుభట్టా చార్యులు రచించారు.’ఆనంద సంహిత’లో శ్రీ విఖనస మహర్షి శిష్యులైన మరిచి మహర్షి రచించిన 20 అధ్యాయాలలో వైఖానస అగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. విష్ణు పారమ్యం, భగవత్ అర్చన, వైఖానస పూజ విధానం, వైఖానస మహాత్యం తదితర అంశాలు ఉన్నాయి.’ఆహ్నికామృతం’ గ్రంధాన్ని వాసుదేవ భట్టాచార్యులు రచించారు. దీనిని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులచే పరిష్కరింపజేసి టీటీడీ ముద్రించింది. ఇందులో వైఖానసంలో నిత్య కర్మలను ఎలా నిర్వర్తించాలో వివరిస్తుంది.

ఈ గ్రంథం పూర్వభాగంలో శాస్త్ర నియమాలు, ఉత్తర భాగంలో మంత్ర విధానం సవివరంగా వివరించబడ్డాయి.’మానవత్వం నుండి దివ్యత్వం వైపునకు’ అనే గ్రంధాన్ని డాక్టర్ పి.వరలక్ష్మి రచించారు. మానవత్వం నుండి దివ్యత్వం వైపునకు జీవన మార్గం ఏ విధంగా సాగాలని ఈ గ్రంధం వివరిస్తుంది.’ ఏ కంపెండియం నేమ్స్ ఇన్ వాల్మీకి రామాయణం’ అనే ఇంగ్లీష్ గ్రంధాన్ని డాక్టర్ వేమిరెడ్డి సులోచన దేవి రచించారు. శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణాన్ని భారతీయ భాషలతో పాటు, ప్రపంచ భాషల్లో కూడా అనేకమంది అనువదించారు. రామాయణంలోని పాత్రలు, విశేషాలు తెలుగులో ఉన్న విధంగానే ఆంగ్లంలో కూడా అనువదించారు.టీటీడీ దాసహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వ్యాసరాజ తీర్ధులు కన్నడలో రచించిన కీర్తనలను తెలుగులో అనువదించిన ‘ దాస సాహిత్య సౌరభము -2’ , మైసూరుకు చెందిన దీపిక పాండురంగే రచించిన ‘సాద్వి సాధన చరితే’ కన్నడ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
Tags:Unveiling of six spiritual books at Mutyapupandiri Vahanaseva
